గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని ఎత్తివేస్తూ కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానాన్ని ప్రోత్సహించే ప్రకటనలు ఇవ్వకూడదంటూ బ్లింకిట్ సహా అన్ని క్విక్ కామర్స్ సంస్థలకు స్పష్టమైన సూచనలు చేశారు.
డెలివరీ బాయ్స్పై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుందని, రోడ్డు ప్రమాదాల ముప్పు ఎక్కువవుతోందని గిగ్ వర్కర్లు గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త ఏడాదికి ముందు ఈ 10 నిమిషాల నిబంధనను ఎత్తివేయాలంటూ గిగ్ వర్కర్లు నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కార్మికుల భద్రత, పని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై డెలివరీ టైమ్ విషయంలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా విధానాలు రూపొందించాలని, కార్మికులపై అనవసర ఒత్తిడి తేవద్దని సంస్థలకు కేంద్రం సూచించింది. ఈ నిర్ణయంతో గిగ్ వర్కర్లకు కొంత ఊరట కలగనుందని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.